గడ్డం గంగారెడ్డి

గడ్డం గంగారెడ్డి

గడ్డం గంగారెడ్డి తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకుడు, లోక్‌సభ సభ్యుడు.[1][2]

జీవిత విశేషాలు

నిజామాబాదు జిల్లా, జక్రాన్‌పల్లె మండలంలోని కేశ్‌పల్లిలో 1933, జూలై 12న రాజారెడ్డి, నర్సమ్మ దంపతులకు జన్మించిన గంగారెడ్డి, నిజాం కళాశాలలో ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు.[3] ఈయన భార్య కాంతమ్మ. వీరికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఆయన ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామ చేసి 1956లో నిజామాబాదు జిల్లా, పడ్కల్ గ్రామ సర్పంచిగా ప్రజా జీవితాన్ని ప్రారంభించి, ఆ పదవిలో 1960 దాకా కొనసాగాడు.[4]

మూడు సార్లు లోక్‌సభకు ఎన్నికైన గంగారెడ్డి తొలిసారి 1991 లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిజామాబాదు నియోకవర్గం నుండి 10వ లోక్‌సభకు ఎన్నికై 1996 దాకా పనిచేశాడు.[5] ఆ తర్వాత రెండేళ్ళ విరామం తర్వాత 1998 లో తిరిగి 12వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు. 1999లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కూడా గెలిచి 13వ లోక్‌సభలో 2004 వరకు పార్లమెంటు సభ్యునిగా పనిచేశాడు. లోక్‌సభ సభ్యునిగా గంగారెడ్డి అనేక కమిటీలలో పనిచేశాడు. ముఖ్యంగా నీటి వనురులు, పట్టణ వ్యవహారాలు, ఉపాధి, గ్రామాభివృద్ధి మంత్రిత్వ సలహాసంఘాల్లో చురుకుగా పనిచేశాడు.

2004 లో తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీలో చేరి డిచ్‌పల్లి నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు. 2008లో శాసనసభకు రాజీనామా చేసి, మధ్యంతర ఎన్నికల్లో తిరిగి అదే స్థానం నుండి గెలుపొంది 2009 వరకు శాసనసభ్యునిగా కొనసాగాడు. 2009 లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో డిచ్‌పల్లి నియోజకవర్గం నిర్మూలించబడింది. 2009 లో తెరాస పార్టీ నిజామాబాదు లోక్‌సభ అభ్యర్థిత్వాన్ని ఆశించిన గంగారెడ్డికి నిరాశ ఎదురై, తెరాసను వదిలి కాంగ్రెసు పార్టీలో చేరాడు.[6] 2012 లో గంగారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి వై.ఎస్.ఆర్ కాంగ్రేస్ పార్టీలో చేరాడు.[7]

అస్తమయం

హైదరాబాద్‌లోని తన నివాసంలో మార్చి 20 2017న కన్నుమూసారు.[8]

మూలాలు