ముల్తాన్ సూర్య దేవాలయం అనేది, పాకిస్తాన్ లోని పంజాబు రాష్ట్రంలోని ముల్తాన్ పట్టణంలో, ఒకప్పడు ఉన్న దేవాలయం[1]. కుష్టు వ్యాధి నివారించుకొనడానికి కృష్ణుని కుమారుడు సాంబడు, నిర్మించిన దేవాలయం.[2][3][4] సూర్య దేవాలయం ఒకప్పుడు ఉండిన ప్రాంతాన్ని, 'మూలస్థానం'గా వ్యవహరించేవారు. ఆ మూలస్థానం అనే పేరునే నేటి ముల్తాన్ పట్టణం ఏర్పడిందని ఒక వాదన[5][6]. అయితే, ఆలయం ఎక్కడ ఉండినదన్న విషయం ఇప్పటికీ పరిశోధకులకి చర్చనీయాంశం.
చరిత్ర
క్రీ.పూ 515 సంవత్సరంలో ఈ ప్రాంతం గుండా ప్రయాణించిన గ్రీకు అడ్మిరల్ స్కైలాక్స్, కశ్యప పురంగా పిలువబడిన ముల్తాన్ పట్టణంలో ఈ ఆలయాన్ని పేర్కొన్నాడు.[7]
చైనా యాత్రీకుడు హుయాన్ త్సాంగ్, సా.శ. 641లో ఈ ఆలయాన్ని దర్శించి, బంగారంతో చేయబడి, కళ్లలో కెంపులు పొదగబడిన మూలవిరాట్టుని వర్ణించాడు. ఆలయ ద్వారాలలోనూ, స్తంభాలలోనూ, శిఖరంలోనూ బంగారం, వెండి, రత్నాలు విరివిగా వాడినట్టు, వేలాది భక్తులు సూర్యుని కొలువడానికి దేవాలయాన్ని సందర్శిస్తూ ఉన్నట్టు, ఆలయంలో దేవదాసీలు ఉన్నట్టు హుయాన్ త్సాంగ్ వర్ణించాడు.[8][9] అంతేగాక, దేవాలయంలో శివుని, బుద్ధుని విగ్రహాలు అనేకం ఉన్నట్టు కూడా హుయాన్ త్సాంగ్ పేర్కొన్నాడు.[10]
సా.శ. 8వ శతాబ్దంలో ముల్తాన్ ని ఆక్రమించిన మహమ్మద్ బిన్ ఖాసిం యొక్క ఉమయ్యద్ సామ్రాజ్యానికి, ఈ దేవాలయం గొప్ప ఆదాయవనరు అయింది.[11][12] మహమ్మద్ బిన్ ఖాసీం, 6000 మంది ఆలయ పరిరక్షకులని బంధించి, ఆలయ సంపదనంతటినీ దోచుకున్నాడు. అయితే, మూలవిరాట్టుని మాత్రం నాశనం చేయకుండా విడిచిపెట్టాడు. కానీ, తన విజయానికి చిహ్నంగా గోమాంసాన్ని విగ్రహం మెడలో వేలాడదీసాడు.[13][14][15] మూలవిరాట్టు చెక్కతో చేయబడి, ఎర్రటి తోలు కప్పబడి, కెంపులు పొదిగిన కళ్లతో ఉండినదని వర్ణించాడు. గుడి ఉన్న ప్రాంతానికి దగ్గరలో మసీదుని నిర్మించాడు.
ఖాసీం తర్వాతి ముస్లిం రాజులు, ఆ విగ్రహాన్ని ఆసరాగా తీసుకుని హిందు రాజులని బెదిరించేవారు. ఎవరేని హిందూ రాజు, ముల్తాన్ పై దండెత్తబోతే, విగ్రహాన్ని ధ్వంసం చేస్తామని బెదిరించేవారు. దానితో ఆ రాజులు వెనక్కి తగ్గేవారు.[13][16][17]
అయితే,10వ శతాబ్దాంతంలో ముల్తాన్ ని ఆక్రమించిన ఇస్మాయిలీలు ఆలయాన్ని పూర్తిగా నేలమట్టం చేసి, విగ్రహాన్ని నాశనం చేసారు. ఆ దేవాలయం ఉన్న చోట మరో మసీదుని నిర్మించడమే కాక, ఉమయ్యద్ సామ్రాజ్య కాలంలో నిర్మించిన మసీదుని కూడా మూసివేసారు.[13][18][19]
తర్వాత వచ్చిన ఘజినీ మహమ్మద్, ఉమయ్యద్ మసీదుని తెరిపించి, ఇస్మాయిలీ మసీదుని మూసివేయించాడు. ఇస్మాయిలీ మసీదు కాలగర్భంలో కలిసిపోయింది.
11వ శతాబ్దానికి చెందిన ఆల్-బెరూనీ, ఆలయం పూర్తిగా ధ్వంసమై, మరిక నిర్మించబడని కారణం చేత, హిందువులు రావడం మానివేసారని పేర్కొన్నాడు.